భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలు, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది సమతుల్య ఆహార వినియోగానికి సూచన అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. భారత్లో పేదరికం 5 శాతానికి తగ్గిందని చెప్పారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే తెలిపింది. 2011-12 నుంచి పోల్చి చూస్తే పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5శాతం పెరిగి రూ.3,510గా ఉందని, గ్రామాల్లో నెలవారీ ఖర్చు 40.42శాతం పెరిగి రూ.2,008గా ఉందని స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో 50శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. 2004-05లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చేసే ఖర్చుల్లో 91శాతం వ్యత్యాసం ఉండేదని, ఇప్పుడది 71శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది. ఇది అసమానతల తగ్గింపును సూచిస్తుందని సర్వే పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య వంటి ప్రయోజనాలను సర్వేలో చేర్చలేదని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ నివేదిక తెలిపిన వివరాల మేరకు భారత్లో పేదరికం దాదాపు అదృశ్యమైందని ఆయన పేర్కొన్నారు.