Saturday, September 28, 2024
HomeUncategorizedబీజేపీలో చేరితే ఐదు కోట్లు, లోక్‌సభ సీటు ఆఫర్‌

బీజేపీలో చేరితే ఐదు కోట్లు, లోక్‌సభ సీటు ఆఫర్‌

Date:

బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న ఒక వ్యక్తి బిజెపి పార్టీలో చేరితే ఐదు కోట్లతో పాటు లోక్‌సభ సీటు తనకు ఆఫర్‌ చేసినట్లు ఆప్‌ ఎమ్మెల్యే ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని లూథియానా సౌత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చీమా, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆప్‌ను వీడాలని తనను ప్రేరేపిస్తున్నారని ఆమె తెలిపింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న సేవక్ సింగ్ అనే వ్యక్తి తనకు ఫోన్‌ చేశాడని చెప్పింది. బీజేపీలో చేరితే ఐదు కోట్లు ఇస్తామని అతడు ఆఫర్‌ చేశాడని ఆరోపించింది. ఢిల్లీకి చెందిన తాను బీజేపీ సీనియర్‌ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్‌ కూడా ఇప్పిస్తానని అతడు హామీ ఇచ్చాడని తెలిపింది.

ఆప్‌ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చీమా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వీడన్‌ నంబర్ నుంచి ఆమెకు ఈ ఫోన్‌ కాల్‌ వచ్చినట్లుగా తెలుస్తున్నదని పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు సేవక్ సింగ్ అనే వ్యక్తితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పంజాబ్‌ బీజేపీ ప్రతినిధి జై బన్సాల్‌ తెలిపారు. ఆప్‌ ఎమ్మెల్యే ఆరోపణలపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.