భారత సుప్రీంకోరర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలోని రాజకీయ పార్టీలకు సమర్పించే ఆ బాండ్ల గురించి కొన్ని వివరాలు తెలిశాయి. ఆ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కన్నా.. బీజేపీకి సుమారు ఆరు రెట్లు అధికంగా ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు బాండ్ల రూపంలో కేవలం 1123 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రశ్నించిన సీపీఎం పార్టీ.. ఒక్క రూపాయి కూడా ఆ రూపంలో రాలేదని నిర్ధారించారు.
పార్లమెంట్లో పొందిపరిచిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 16,518 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు వచ్చాయి. అయితే పార్లమెంట్లో పార్టీ వివరాలను వెల్లడించలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులో ఆయా పార్టీలకు ఎంత వచ్చిందో తేలింది. ఎలక్టోరల్ బాండ్లను అందించిన దాతలు వివరాలను మాత్రం వెల్లడించలేదు. బాండ్ల రూపంలో 2017 నుంచి 2023 మధ్య కాలంలో బీజేపీకి సుమారు 6,566 కోట్లు వచ్చాయి. బాండ్ల అందుకున్న పార్టీల్లో టీఎంసీకి 1092 కోట్లు ముట్టాయి. బీజూ జనతాదళ్కు 774 కోట్లు, డీఎంకేకు 616 కోట్లు, బీఆర్ఎస్కు 386 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు 383 కోట్లు, టీడీపీకి 146 కోట్లు, శివసేనకు 101.38 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 94.28 కోట్లు .. బాండ్ల రూపంలో వచ్చాయి.