ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం ఢిల్లీ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ”ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నాం.
పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదు” అని తెలిపారు.