Monday, October 7, 2024
HomeUncategorizedబిఆర్ఎస్ ఎమ్మెల్యెల హ‌క్కులు కాల‌రాస్తున్నారు

బిఆర్ఎస్ ఎమ్మెల్యెల హ‌క్కులు కాల‌రాస్తున్నారు

Date:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని, కావాలనే విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తోందని బిఆర్ఎస్‌ నేత కేటీఆర్‌ ఆక్షేపించారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘటనలకు సంబంధించి ఆయన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. ప్రతి సందర్భంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు.

”ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రోటోకాల్‌ ఉంటుంది. కాంగ్రెస్‌ నాయకులుకావాలని భారాస ఎమ్మెల్యేలను అవమానించేలా ప్రోటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్‌ నాయకులే పంపిణీ చేస్తున్నారు. హుజూరాబాద్‌, మహేశ్వరం, అసిఫాబాద్‌ సహా భారాస ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇలాగే జరుగుతోంది. శాసనసభ్యుల హక్కులు, వారికి ప్రోటోకాల్‌ పరిరక్షణ, గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శాసనసభాపతిదే”అని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల హక్కుల రక్షణ విషయంలో సభాపతి అధికారాలను వినియోగించి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు వెంటనే సీఎస్‌ సహా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.