ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి, కలిసి చదువుకున్న బాల్య స్నేహితులు.. ఇప్పుడు ఆ ఇద్దరూ బాల్య స్నేహితులే దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా మారారు. వీరు మరెవరో కాదు దేశంలోని ఆర్మీ, నేవీ అధిపతులు. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు.
దినేష్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970లో మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. నాటి నుంచే వారిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది. ప్రస్తుతం వారు వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుతుంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ”ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే అధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్కు దక్కుతుంది” అని అభినందించారు. 1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు.