అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ప్లానింగ్’తో కాకుండా ‘మోడలింగ్’తో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఈడీ, సీబీఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయి” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో అవినీతిపరుల ‘అమృతకాలం’ నడుస్తోందని విమర్శించారు. ఢిల్లీలోని ‘ప్రగతి మైదాన్ టన్నెల్’ లోపాలపై ఓ కథనాన్ని ఉటంకిస్తూ ‘ఎక్స్’ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ”రూ.777 కోట్లతో నిర్మించిన ప్రగతి మైదాన్ టన్నెల్ ఒక్క ఏడాదిలోనే పనికిరాకుండా పోయింది.
సెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. ‘ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్’ చేపట్టారు. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్పాస్లు నిర్మించారు. 2022 జూన్లో ప్రధాని మోడీ వీటిని ప్రారంభించారు. అయితే, టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయని.. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తినట్లు ఢిల్లీ ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) పేర్కొంది. రూ.500 కోట్లు జమ చేయాలని, వెంటనే డిజైన్ను సరిదిద్దడంతో పాటు మరమ్మతులు ప్రారంభించాలని ‘ఎల్ అండ్ టీ’కి నోటీసు జారీ చేసింది.