Thursday, September 19, 2024
HomeUncategorizedప్రపంచంలో అత్యుత్తమ బియ్యం జాబితా విడుదల

ప్రపంచంలో అత్యుత్తమ బియ్యం జాబితా విడుదల

Date:

భారతదేశానికి చెందిన బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా గుర్తింపు దక్కింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాను విడుదల చేసింది. ఇందులో బాస్మతి మొదటి స్థానంలో నిలవగా, ఇటలీకి చెందిన అర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో నిలిచాయి. బాస్మతి అన్నం, అద్భుతమైన సువాసన, రుచి, పొడవైన ఆకారం ఉన్నప్పటికీ, ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ అయినా, బిర్యానీ అయినా, బాస్మతి భారతీయులకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారత్‌ బాస్మతి బియ్యాన్ని సరఫరా చేస్తుంది. దీనిని మనదేశంలోని హిమాలయాల్లో మాత్రమే పండిస్తారు. అయితే దీనిని పాకిస్తాన్‌లో కూడా సాగు చేస్తారు. ఎగుమతి పరంగా చూస్తే బాస్మతీ ఎగమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

2021లో రక్షిత భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం భారతదేశం యూరోపియన్ యూనియన్‌కు దరఖాస్తు చేసినప్పుడు, పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఇదే జరిగితే తమ మార్కెట్‌ను కోల్పోతామని పాకిస్థాన్‌ భయపడింది. బాస్మతిని ఎగుమతి చేయడం ద్వారా భారత్‌ ప్రతి యేట 6.8 బిలియన్ డాలర్లను అర్జిస్తోంది. పాకిస్తాన్‌లో 2.2 బిలియన్ డాలర్లు మాత్రమే అర్జిస్తోంది.

బాస్మతి చరిత్ర తెలుసా..

బాస్మతి అనే పదం వాస్, మయాప్‌ అనే సంస్కృత పదాల కలయిక వలన రూపొందింది. వాస్ అంటే సువాసన, మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడబడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణి అని పిలుస్తారు. విశేషమేమిటంటే.. సువాసనకు పేరుగాంచిన దీన్ని తయారుచేసిన వెంటనే ఆ వాసన పరిసరాలకు వ్యాపిస్తుంది. హిమాలయాల దిగువ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో బాస్మతిని ఎక్కువగా పండిస్తారు. ప్రాచీన భారత దేశంలో కూడా బాస్మతి పండించినట్లు చారిత్రక పత్రాలు చూపిస్తున్నాయి. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకం ప్రకారం.. హరప్పా-మొహెంజొదారో త్రవ్వకాలలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారులు 1766లో మధ్యప్రాచ్య దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు చరిత్ర గ్రంధాలు తెల్పుతున్నాయి. భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలు కూడా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యమత్ వంటి అనేక దేశాలకు భారత్‌ గరిష్టంగా బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది.