Monday, October 7, 2024
HomeUncategorizedపెళ్లి ఖర్చుకు అయిదంతలు పెరిగిన‌ ఆదాయం

పెళ్లి ఖర్చుకు అయిదంతలు పెరిగిన‌ ఆదాయం

Date:

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం వైభవంగా సాగింది. ఈ నెల 12వ తేదీన ముంబై బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి పీటలు ఎక్కారు. అంతకుముందు వారం రోజుల ముందు నుంచీ సంగీత్ నిర్వహించారు. ఆ తరువాత శుభ్ ఆశీర్వాద్ వేడుకలను చేపట్టారు.

నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.

రాధిక మర్చంట్ అడుగు పెట్టి వేళా విశేషం సంధ‌ర్బంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు భారీగా పెరిగాయి. దీని విలువ ఏకంగా 25,000 కోట్ల రూపాయలు. 10 రోజుల వ్యవధిలోనే ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 25,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ నెల 5వ తేదీన 118 బిలియన్ డాలర్లుగా ఉన్న అంబానీ ఆస్తులు ఈ 10 రోజుల వ్యవధిలో 121 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఈ ఇండెక్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా ఒకటి కంటే ఎక్కువ శాతం మేర పెరిగిందని వివరించింది.

ఈ క్రమంలో అంబానీ గ్లోబల్ ర్యాంకింగ్ కూడా మెరుగుపడింది. పెళ్లికి ముందు వరకు అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ.. ఆ తరువాత 11వ స్థానానికి ఎగబాకారు. ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకున్నారు. కొడుకు పెళ్లి కోసం అంబానీ అక్షరాలా 5,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా పెళ్లి అత్యంత ఆడంబరంగా చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో ఆదాయాన్ని రాబట్టుకున్నారు. పెళ్లి ఖర్చుకు అయిదంతల ఆదాయాన్ని రాబట్టుకోగలిగారు.