Friday, September 20, 2024
HomeUncategorizedపాకిస్తాన్‌తో ఇక‌పై చ‌ర్చ‌లు లేవు

పాకిస్తాన్‌తో ఇక‌పై చ‌ర్చ‌లు లేవు

Date:

పాకిస్తాన్‌తో చర్చలు జరిపే కాలం ముగిసిందని, ఇక మీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్‌.. పాకిస్థాన్‌ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్‌ మనతో ఎలా వ్యవహరిస్తే.. మనమూ అందుకు తగిన విధంగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్‌ ఎలా వ్యవహరిస్తే.. మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్‌ నుంచి వచ్చే చర్య సానుకూలమైనా ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ ముందడుగు వేస్తుంది’ అని జై శంకర్‌ స్పష్టం చేశారు.

ఇదే కార్యక్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా జైశంకర్‌ స్పందించారు. పాకిస్థాన్‌ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలే జమ్మూ లోయలో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అస్థిరంగా మారాయన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జైశంకర్‌ పేర్కొన్నారు. పొరుగు దేశం బంగ్లాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు జై శంకర్‌ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమయానుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. పొరుగుదేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశాల మధ్య పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.