ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా దానిపై నేడు విచారణ జరిగింది. పరువుకు భంగం కలిగించే వీడియోను రీట్వీట్ చేసి తప్పు చేశానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించారు. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఆప్ చీఫ్ తన తప్పును అంగీకరించడంతో ఈ కేసును ఇక్కడితో మూసివేయాలనుకుంటున్నారా..? అని కోర్టు ఫిర్యాదుదారుని అడిగింది. అలాగే ఈ కేసులో మార్చి 11 వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక వీడియోను కేజ్రీవాల్ తిరిగి ట్వీట్ చేసినందుకు క్రిమినల్ కేసు దాఖలైంది. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజ్రీవాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. జర్మనీలో నివసిస్తున్న రాఠీ ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II’ పేరిట.. తప్పుడు ఆరోపణలు ఉన్న ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని ఫిర్యాదుదారు వికాస్ సాంకృత్యాయన్ తన పిటిషన్లో పేర్కొన్నారు.