Friday, October 4, 2024
HomeUncategorizedపనిలో చంద్రబాబుతోనే తనకు పోటీ

పనిలో చంద్రబాబుతోనే తనకు పోటీ

Date:

ప్రస్తుతం చంద్రబాబుతో అభివృద్ధి లో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగంలో సాధించలేనిది ఏమీ లేదన్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పునాది వేశారన్నారు. హెల్త్ టూరిజం హబ్ లో బస్వతారకం ఆస్పత్రికి స్థలం కేటాయిస్తామని నందమూరి బాలయ్య కు రేవంత్ హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 25వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ తిరిగి 25 వార్షికోత్సవంకు రావాలని కోరుతున్నారని.. 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని చెప్పుకొచ్చారు. ఆస్పత్రి లీజ్ వివాదాన్ని క్యాబినేట్ నిర్ణయం తీసుకుని పరిష్కరించామని చెప్పారు. భవిష్యత్తులో బసవతారకం ఆస్పత్రికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు గురించి రేవంత్ ప్రస్తావన చేసారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందన్నారు..

తాను ఇదే విషయాన్ని తమ అధికారులకు సూచించినట్లు రేవంత్ వెల్లడించారు. గతంలో 12 గంటలు పని చేస్తే చాలు అనుకునే వాడిని కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటలు పని చేసే వ్యక్తిగా చంద్రబాబు గురించి చెప్పుకొచ్చారు. తనతో తమ అధికారులంతా అంతే ధీటుగా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలోనే ప్రగతి పథంలో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మూడోతరం లోకేష్, భరత్ రాజకీయాల్లో ఎలాంటి మార్క్ కనబరుస్తారో చూడాలని రేవంత్ వ్యాఖ్యానించారు. బసవతారకం సేవల విస్తరణ కోసం సహకారం కోరగానే రేవంత్ రెడ్డి అంగీకరించారని ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. సేవలను మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.