Thursday, October 3, 2024
HomeUncategorizedనేడే ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం

నేడే ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం

Date:

భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సిద్ధమైంది. పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్‌లతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాణస్వీరాకానికి విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో జీ 20 తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ఎన్డీఏ సభ్యులతో సహా విదేశీ ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల నుంచి వేదిక వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్‌ ఉంటుంది. ఢిల్లీ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్‌లు, స్నిపర్‌లతో బహుళ లేయర్‌ల భద్రత రాష్ట్రపతి భవన్‌ చుట్టూ ఉండనుంది. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

భద్రతా సిబ్బంది అదుపులో హోటళ్లు

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్ మరియు సీషెల్స్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం నగరంలోని లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్, ఒబెరాయ్ వంటి హోటళ్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ హోటళ్లను భద్రతా సిబ్బంది తమ అదుపులోకి తీసుకున్నాయి. ఆహ్వానం అందిన వారిలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే రానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో నేతలు పాల్గొంటారు.

సామాన్యులకు ప్రత్యేక ఆహ్వానం

ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితుల్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు, వందే భారత్ మరియు మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే శాఖ సిబ్బంది మరియు ఉద్యోగులు, ట్రాన్స్‌జెండర్లు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి పారిశుధ్య కార్మికులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు మరియు విక్షిత్ భారత్ అంబాసిడర్లు ఉన్నారు.