తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని వందరోజుల్లోనే ప్రజలు గ్రహించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదు. రుణమాఫీ జరిగితే కాంగ్రెస్కు ఓటు వేయండి. రుణమాఫీ రాకుండా మోసపోతే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఏక్నాథ్ శిందేలు కాంగ్రెస్లోనే ఉన్నారు” అని కేటీఆర్ అన్నారు.