Saturday, September 28, 2024
HomeUncategorizedదేశంలో బుల్లెట్‌ రైళ్లపై మోడీ కీలక హామీ

దేశంలో బుల్లెట్‌ రైళ్లపై మోడీ కీలక హామీ

Date:

దేశంలో బుల్లెట్ రైళ్లకు సంబంధించి అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామని బుల్లెట్‌ రైళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక హామీ ఇచ్చారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని చెప్పారు. ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఇవి పూర్తి కావచ్చాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌కు ఒక్కోటి చొప్పున బుల్లెట్‌ రైలు రానుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’ అని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు.

వందేభారత్‌ రైలు సర్వీసులను దేశంలోని ప్రతి మూలకూ విస్తరిస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. వందేభారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ ఛైర్‌కార్‌, వందేభారత్‌ మెట్రో వంటి మూడు మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయని అన్నారు. వందేభారత్‌ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య రూ. 1.08లక్షల కోట్లతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు రూ.10వేల కోట్లను అందిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్రలు రూ.5వేల కోట్లు చొప్పున చెల్లించనున్నాయి.