Sunday, October 6, 2024
HomeUncategorizedదేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చిందే కాంగ్రెస్‌

దేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చిందే కాంగ్రెస్‌

Date:

దేశంలో మొదటి సారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య’ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్ర‌భుత్వ విధానం తెలియాలి. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసే విధంగా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకం. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా చూస్తాం. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండ కూడదు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైంది సివిల్‌ ఇంజినీరింగ్‌. కొన్ని కళాశాలల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ను లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. కళాశాలల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులను కచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.

ప్ర‌పంచంతో పోటీప‌డుదాం

గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలి. ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోంది. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం కూడా అందుకు ప్రోత్సహిస్తుంది. త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అటానమస్‌ హోదా ఇస్తాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడే విధంగా కాకుండా ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనం తయారు కావాలి. మా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది” అని సీఎం వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు, జేఎన్‌టీయూ వీసీ బుర్రా వెంకటేశం, ఇంజినీరింగ్‌ కాలేజీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.