Monday, September 23, 2024
HomeUncategorizedదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం

Date:

దేశంలోనే 2.3 కిలోమీటర్ల పొడవున్న అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బెట్‌ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాదీశ్‌ ఆలయంలో ప్రధాని పూజలు చేయనున్నారు. నేటి మధ్యాహ్నం గుజరాత్‌ (రాజ్‌కోట్‌), ఆంధ్రప్రదేశ్‌ (మంగళగిరి), పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లు వెచ్చించింది.