బిజెపి ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వారి వ్యాఖ్యలను నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలకు గానూ దిలీప్ ఘోష్, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు గానూ సుప్రియా శ్రీనేత్కు ఇటీవల ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీనిపై ఈ నేతలు వివరణ ఇచ్చారు. వాటిని పరిశీలించిన ఈసీ.. వీరిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది.
వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ దిగజారి మాట్లాడినట్లు స్పష్టమైంది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే. బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇకపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి వారు చేసే ప్రసంగాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాం” అని ఈసీ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలకు గానూ వార్నింగ్ నోటీసులు వారి సంబంధిత పార్టీల అధినేతలకు కూడా పంపించాం. తమ నేతలు బహిరంగ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా పార్టీలు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.