Sunday, September 22, 2024
HomeUncategorizedతనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు

తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు

Date:

గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా కలిపి దాదాపు 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్నానని, ఇంత సుదీర్ఘకాలంలో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 370కుపైగా సీట్లను గెలవడమే జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని బిజెపి శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షేమం, దేశాభివృద్ధి, అంతర్జాతీయ వేదికపై పెరిగిన భారత ప్రాభవం తదితర అంశాల చుట్టూ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకృతం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో రెండు రోజుల బిజెపి జాతీయ మండలి సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అనవసరమైన, భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతాయి. అయితే.. దేశాభివృద్ధి, పేదల అనుకూల విధానాలు, అంతర్జాతీయ వేదికపై భారత్‌ సాధించిన విజయాలు తదితర అంశాలను పార్టీ సభ్యులు ప్రచారంలో ప్రస్తావించాలి” అని ప్రధాని మోడీ చెప్పారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వెల్లడించారు. కేంద్ర పథకాల లబ్ధిదారులతో మమేకమయ్యేందుకు ఫిబ్రవరి 25 నుంచి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది ఆరోపణల రహిత, వికాసంతో కూడిన కాలమని చెప్పారు. ఇదిలా ఉండగా.. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే ‘ఆర్టికల్ 370’ను ముఖర్జీ వ్యతిరేకించారు. 2019 ఆగస్టులో మోదీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.