Tuesday, September 24, 2024
HomeUncategorizedఢిల్లీ పోలీసుల పహారాలో గ్యాంగ్‌స్టర్ల జంట పెళ్లి

ఢిల్లీ పోలీసుల పహారాలో గ్యాంగ్‌స్టర్ల జంట పెళ్లి

Date:

సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణతో పాటు 250 మంది ఢిల్లీ పోలీసుల పహారా మధ్య ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ల జంట వివాహం చేసుకుంది. హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరి అలియాస్‌ మేడమ్‌ మింజ్‌ పెళ్లి ఢిల్లీలోని ఒక బాంక్వెట్‌ హాల్‌లో జరిగింది. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వేడుక దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్‌-3లో ఉన్న సంతోష్‌గార్డెన్‌లో ఈ వేడుక జరగ్గా.. ఆ పరిసర ప్రాంతమంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సందీప్‌ గతంలో ఓసారి హరియాణా పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్‌ ప్రవేశమార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు మొదలు.. లోనికి వచ్చే వారికి బార్‌కోడ్‌ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. అతడి తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ వేదికను బుక్‌ చేశాడు.

అనురాధ అలియాస్‌ మేడమ్ మింజ్ అలియాస్ రివాల్వర్‌ రాణి, సందీప్‌ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ పలు కేసుల్లో నిందితులు. సందీప్‌.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు సందీప్‌ అత్యంత సన్నిహితుడు. అతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి డజనుకు పైగా కేసులున్నాయి. అనురాధ..గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌ సింగ్ (2017లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు) వద్ద పని చేసింది. మనీ లాండరింగ్, కిడ్నాప్‌, బెదిరింపులు వంటి పలు కేసుల్ని ఎదుర్కొంటోంది. 2020లో పరారైన వీరు పోలీసుల్ని తప్పించుకొని పలు రాష్ట్రాలకు మకాం మార్చారు. చివరకు 2021 జులైలో పోలీసులకు చిక్కారు. కొంతకాలం తర్వాత ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ పెళ్లి కోసం కోర్టు అతడికి ఆరు గంటలపాటు పెరోల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.