తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు 12 రోజులుగా ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే రైతులు మకాం వేశారు. కావాల్సిన నిత్యవసారాలన్నీ వెంట తెచ్చుకుని బార్డర్లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.ఈ నెల 29న భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
తాము సాగుచేసిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు.. గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే.. కేంద్ర ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తు వస్తోంది. ఇప్పటికే నాలుగు విడతలుగా చర్చలు జరుగగా అవన్నీ విఫలమవ్వడంతో.. మళ్లీ నిరసనలు, ఆందోళనలకు తెరలేపారు. గతంలో మాదిరిగా రైతులు రాజధానిలోకి చొచ్చుకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నిరసన తెలియజేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్, ప్లాస్టిక్ బుల్లెట్లును సైతం ప్రయోగించారు. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులకు రైతులకు మధ్య జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్కరణ్ సింగ్ మరణించారు. శుభ్కరణ్ సింగ్ మృతికి పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది. నిరసనలో పాల్గొంటూ మరో రైతు దర్శన్ సింగ్ గుండెపోటుతో మరణించారు.