దేశరాజధాని ఢిల్లీని ఎండలు వణికిస్తున్నాయి. ఎండలకు తోడు తీవ్రమైన వడ గాలులు వీస్తున్నాయి. దీంతో గత 24 గంటల్లో 22 మంది హీట్ వల్ల మృతిచెందారు. ఆర్ఎంఎల్, సఫ్దార్జంగ్, ఎల్ఎన్జేపీ ఆస్పత్రుల్లో ఆ మరణాలు నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హీట్స్ట్రోక్ వల్ల ఢిల్లీ ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో వడదెబ్బ తగిలి 33 మంది పేషెంట్ల ఆడ్మిట్ అయ్యారు. అయితే గడిచిన 24 గంటల్లో ఆ ఆస్పత్రిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 22 మంది పేషెంట్లు అడ్మిట్ అవ్వగా, నలుగురు మృతిచెందారు. ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో 17 మంది రోగులు అడ్మిట్ కాగా, దాంట్లో అయిదుగురు మృతిచెందారు. నగరంలోని నిగంబోద్ ఘాట్ శ్మశానవాటికలో రోజువారి దహనం కేసులు పెరిగిపోయాయి. అంతిమ సంస్కారాల నిర్వహణ కోసం ఆ ఘాట్కు వస్తున్న మృతదేహాల సంఖ్య 136 శాతం పెరిగింది.