Thursday, September 19, 2024
HomeUncategorizedజాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

Date:

భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం దేశమంతా అంగరంగవైభవంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు.

ఈ ఉదయం జాతీయ వార్‌ మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది.

పరేడ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ‘ఆవాహన్‌’తో పరేడ్‌ను మొదలుపెట్టారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.