రాఖీ పౌర్ణమి వేళ బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌధరి, విజయ్ కుమార్ శర్మతో కలిసి రాజధాని వాటికలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బిహార్లో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్ను బిహార్ వృక్ష సురక్షా దివస్గా పాటిస్తోందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ”మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడి పర్యావరణాన్ని సంరక్షిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ హరియాలి మిషన్ కింద మొక్కలు నాటడంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది” అని సీఎంవో పేర్కొంది.