Friday, September 20, 2024
HomeUncategorizedకోల్‌క‌తా నిందితుడి త‌ర‌పున ఎవ‌రూ వాదించొద్ద‌ని నిర‌స‌న‌

కోల్‌క‌తా నిందితుడి త‌ర‌పున ఎవ‌రూ వాదించొద్ద‌ని నిర‌స‌న‌

Date:

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నిందితుడి తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. ఇలాంటి పరిణామాల నడుమ ఓ మహిళా న్యాయవాది క‌వితా స‌ర్కార్‌ నిందితుడి తరఫున వాదనలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కేసు ఎంతటి తీవ్రమైనదైనా సరే.. పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా ముఖ్యమే. దీన్ని పరిగణనలోకి తీసుకునే ఇటీవల కోర్టు లీగల్‌ ఎయిడ్‌కు సిఫార్సులు చేసింది. దీంతో సంజయ్‌ రాయ్‌ కోసం వాదించే బాధ్యతలను కోల్‌కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్‌కు అప్పగించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఎవరీ కవితా సర్కార్‌..

52 ఏళ్ల కవిత లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సాధారణంగా కేసు విచారణ కోసం ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నవారి కోసం.. లేదా వాదించేందుకు ఏ లాయర్‌ ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కౌన్సిల్‌ వారికి న్యాయపరమైన సాయం చేస్తుంటుంది. అలా.. సంజయ్‌ రాయ్‌ కేసు కవిత చేతికొచ్చింది. హూగ్లీ మోహ్‌సిన్‌ కాలేజీ నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన కవిత.. అలిపోర్‌ కోర్టులో తన కెరీర్‌ను ప్రారంభించారు. గతేడాది జూన్‌లోనే సెల్దా కోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయవృత్తిలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె తొలుత ఎక్కువగా సివిల్‌ కేసులనే వాదించారు. గతేడాది ఫిబ్రవరిలో క్రిమినల్‌ లాయర్‌గా స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో చేరారు.