కేసీఆర్, బిఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మిషన్ భగీరథపైనా విచారణకు ఆదేశించామని సీఎం వెల్లడించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభకు రావాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ప్రజలు చూశారన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.