Tuesday, October 1, 2024
HomeUncategorizedకేరళలో కొత్త వైరస్.. ఇప్పటివరకు 12మంది మృతి

కేరళలో కొత్త వైరస్.. ఇప్పటివరకు 12మంది మృతి

Date:

హెపటైటిస్‌ ఎ వైరస్‌ కేరళ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో 1,977 హెపటైటిస్‌ ఎ కేసులు వెలుగు చూసినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లోనే అత్యధిక కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఈ నాలుగు జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారును ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి వనరులను క్లోరినేషన్ చేసి, రెస్టారెంట్లకు హీట్ వాటర్ ను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు.

హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. హెచ్ఐవీ, కాలేయ వ్యాధితో ఉన్నవారు త్వరగా హెపటైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలసట, కడుపునొప్పి, జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు (చర్మం, గోర్లు, కళ్లు, మూత్రం పసుపు రంగులో ఉండటం) ఈ వ్యాధి లక్షణాలు. కాచి చల్లార్చిన నీరు తాగడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండటం, తినేముందు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా హెపటైటిస్ ఏ బారిన పడకుండా ఉంటారు.