ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తామని తెలిపింది. ప్రజలు తనకు ఓటేస్తే.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్ తన ప్రసంగాల్లో పేర్కొన్నారంటూ ఈడీ తరఫున వాదిస్తోన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. ఆయన ఆ మాట ఎలా అంటారని అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు, ఢిల్లీ సీఎంకు బెయిల్ రావడంపై కేంద్రంలోని ఒక సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు.
ఇరుపక్షాల వాదనలపై కోర్టు స్పందిస్తూ..”ఈ తీర్పుపై విమర్శలను స్వాగతిస్తున్నాం. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో మా ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. చట్టపాలన దీని ఆధారంగానే ఉంటుంది. మేం ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. అదంతా ఆయన ఊహే. దానిపై మేం మాట్లాడానికి ఏమీ లేదు” అని స్పష్టంచేసింది.