Sunday, September 22, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు

కేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు

Date:

ఒక కేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ‘మనకు సభలో మెజార్టీ ఉంది. కానీ ఆప్‌ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేయాలని యత్నిస్తోన్న తరుణంలో ఈ విశ్వాస తీర్మానం అవసరం. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలిచినా.. 2029 నాటికి ఈ దేశానికి ఆ పార్టీ నుంచి ఆప్ విముక్తి కలిగిస్తుంది’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలుకు మీరు ఎంత డబ్బు వెచ్చించారు..? అని ఈసందర్భంగా బిజెపిని ప్రశ్నించారు. ‘వారు నాపై సిరా చల్లారు. చెప్పులు విసిరారు. ఇప్పుడు అరెస్టు చేస్తామంటున్నారు. మీరు నన్ను జైల్లో పెడితే.. ఈ ప్రభుత్వం పడిపోతుందా..? అది కూడా ట్రై చేసి, మీ కల నెరవేర్చుకోండి. మీరు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగలరు.. కానీ ఆయన సిద్ధాంతాలను కాదు. దేశంలో బిజెపి పార్టీకి ఆప్ పార్టీతోనే అతిపెద్ద ముప్పు అని, అందుకే తమపై అన్నివైపుల నుంచి దాడి జరుగుతోందని అన్నారు.

ఎవరైనా బిజెపి ఒత్తిడికి లోనై.. ఆ పార్టీలో చేరితే వారు అవినీతిపరులు. ఆ ఒత్తిడి ఎదుర్కొన్నవారు నిజాయతీపరులు. గుజరాత్‌లో 30 ఏళ్లుగా బిజెపి అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లు, యూపీలో 10 ఏళ్లుగా కమలం పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అందించండి. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించాం. మేం రాముడి భక్తులమని బిజెపి చెప్తోంది. కానీ మన ఆసుపత్రుల్లో పేదలకు మందులు నిలిపివేశారు. అయినా మీ శత్రుత్వం నాతో. ఢిల్లీ ప్రజల్ని ఎందుకు లాగుతారు..? నా హృదయం ద్రవించిపోతోంది’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.