ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంత బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలంటూ తాను పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.
అనారోగ్య పరిస్థితుల కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం తనకు మరో 7 రోజులు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు.. బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. వైద్య పరీక్షలను తీహార్ జైల్లోనే నిర్వహించాల్సిందిగా అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది. జూన్ 19 వరకూ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.