Saturday, September 21, 2024
HomeUncategorizedకులం గురించి మోడీ అబద్ధం చెప్పారు

కులం గురించి మోడీ అబద్ధం చెప్పారు

Date:

కులం గురించి ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్నారు. మోడీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించారు. దీనిని 2000 సంవత్సరంలో జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చారు. ఆయన ఓబీసీకి చెందిన కుటుంబంలో జన్మించలేదు. అందుకనే.. తన జీవితాంతం కులగణనకు అంగీకరించరు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్‌ తొలుత మోడీ కులాన్ని ‘తెలి’గా పేర్కొన్నారు. ఆ తర్వాత ‘ఘాంచీ’ కులాన్ని ఉద్దేశించే తాను అలా అన్నానని తెలిపారు. ‘ఘాంచీ’నే కొన్ని ప్రాంతాల్లో ‘తెలి-ఘాంచీ’, ‘మోద్‌-ఘాంచీ’గా పేర్కొంటారు.

గురువారం ఒడిశా నుంచి ఈ యాత్ర ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది. కొద్దినెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తొలిసారి అక్కడకు వెళ్లనున్నారు. మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’.. 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 67 రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమం.. దాదాపు 6713 కి.మీ మేర సాగనుంది.