కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. శివమొగ్గ జిల్లాలో ఓ వ్యక్తి మంకీ ఫీవర్తో మృతిచెందారు. దీంతో ఆ మంకీ ఫీవర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కయసన్నూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్డీ) వల్ల 57 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఆమె .. వైరస్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు. ఆ మహిళ గత 20 రోజుల నుంచి వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకారం .. జనవరి నుంచి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలో 5 వేల మందికి మంకీఫీవర్ పరీక్షలు చేశారు.
దాంట్లో పాజిటివ్ కేసులు 120 నమోదు అయ్యాయి. 95 మంది డిస్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా 22 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తేలింది. అటవీ ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించేందుకు 3 నుంచి 8 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. వణుకుడు, జ్వరం, తల నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పి కూడా అధికంగా ఉంటుంది. వాంతులు, ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. లక్షణాలు మొదలైన కొన్ని రోజుల్లో బ్లీడింగ్ కూడా జరుగుతుంది.