Tuesday, October 8, 2024
HomeUncategorizedకథ చెప్పినట్టే ఉంది.. బడ్జెట్ పెట్టినట్టు లేదు

కథ చెప్పినట్టే ఉంది.. బడ్జెట్ పెట్టినట్టు లేదు

Date:

కథ చెప్పారు తప్ప.. బడ్జెట్‌ పెట్టినట్టు అనిపించలేదు. తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ”బిఆర్ఎస్ హయాంలో మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని ఎగ్గొడతామని చెబుతోంది. మేం రైతులకిచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్‌, నీటి సరఫరా, గొర్రెల పంపిణీ లేదు. రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు, వృత్తి కార్మికులను వంచించింది. రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఇది పేదల, రైతు బడ్జెట్‌ కాదు.

*దళితులంటే ప్రభుత్వానికి ప్రేమే లేదు*

రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు. ప్రజల గొంతు కోసింది ఈ ప్రభుత్వం. దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారు. ఒత్తి పలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదు. రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారు. బడ్జెట్‌ ఒట్టి డొల్ల. అన్ని వర్గాలను మోసం చేసింది. పేదల కోసం ఒక్క పాలసీ అయినా ప్రకటించారా? బడ్జెట్‌లో ఒక పద్దు.. పద్ధతి లేదు. బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం. యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం. ఈ ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్‌ చూసిన తర్వాత అర్థమైంది. ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది? ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదు” అని కేసీఆర్‌ విమర్శించారు.