ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ను చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను ఆమె సోదరుడు సమర్థించాడు. రైతు నాయకుడు, పంజాబ్లోని కపుర్తలా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి అయిన షేర్ సింగ్ మహివాల్ తన సోదరికి మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటన గురించి మీడియాతో ఆయన మాట్లాడాడు. ‘చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగిందని మీడియా ద్వారా తెలిసింది. కంగనా మొబైల్, పర్సు తనిఖీ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని నాకు అర్థమైంది. మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉన్నది. అదే ఈ సంఘటనకు దారి తీసింది. సైనికులు, రైతులు ఇద్దరూ ముఖ్యమైనవారు. అన్ని విధాలుగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో మేం ఆమెకు పూర్తి మద్దతుగా ఉంటాం’ అని అన్నాడు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను పంజాబ్కు చెందిన ఒక వ్యాపారి కూడా సమర్థించాడు. మొహాలీలోని జిరాక్పూర్కు చెందిన బిజినెస్ మ్యాన్ శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు, పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్కు ఆయన సెల్యూట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.