Thursday, October 3, 2024
HomeUncategorizedకంగనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌!

కంగనను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌!

Date:

చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ బాలీవుడ్‌ నటి, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కంగన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

నేను క్షేమంగానే ఉన్నాను

ఈ ఘటనపై కంగన స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా.. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు. ఇందుకిలా చేశావని అడగ్గా.. రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగన తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు. మరోవైపు, దిల్లీ చేరుకున్న అనంతరం కంగన సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇతర సీనియర్‌ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎప్‌ కమాండెంట్‌ కార్యాలయానికి తరలించారు.