Wednesday, October 2, 2024
HomeUncategorizedఓటర్లను మోడీ రెచ్చగొడుతున్నారు

ఓటర్లను మోడీ రెచ్చగొడుతున్నారు

Date:

దేశంలోని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శనివారం మహారాష్ట్రలోని ముంబైలో ‘ఇండియా’ బ్లాక్‌ నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఎన్సీపీ (శరద్‌) చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మీడియాతో ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోడీ ఓటర్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘మేం ఇప్పటి వరకు బుల్డోజర్లు వాడలేదు. ప్రధాని స్వయంగా చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తాం. మేం రాజ్యాంగాన్ని అనుసరిస్తాం’ అని అన్నారు.

మహారాష్ట్రలో నిజమైన పార్టీలకు కాకుండా బీజేపీకి మద్దతు ఇచ్చే వర్గాలకు పార్టీ గుర్తులను ఈసీ కేటాయించడాన్ని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ద్రోహం, కుట్రల ఆధారంగా మహారాష్ట్రలో అక్రమంగా ‘మహాయుతి’ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా మద్దతు ఇచ్చారని, ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.