సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు. అలాంటిది ఒక్క హెచ్సీఎల్ టెక్నాలజీస్ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈవిషయం వెల్లడైంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఆయా సంస్థల లాభనష్టాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించాయి. ఈ గణాంకాలను గమనిస్తే.. మొత్తంగా 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. టీసీఎస్లో 13,249 మంది, విప్రోలో 24,516, ఇన్ఫోసిస్లో 25,994, టెక్ మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగుల తగ్గుదల నమోదైంది. ఒక్క హెచ్సీఎల్ టెక్నాలజీస్లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగింది. అంటే టాప్-5 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఒక్క హెచ్సీఎల్లో మాత్రమే. ఈ పరిస్థితి ఉద్యోగార్థులను కలవరపెడుతోంది.
ఓవైపు ఉద్యోగుల సంఖ్య తగ్గిన వేళ.. మళ్లీ ఫ్రెషర్లను నియమించుకోవడంపై ఆయా కంపెనీలు దృష్టి సారిస్తుండడం ఊరట కల్పించే అంశం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సుమారు 40 వేల మందిని, హెచ్సీఎల్ 10 వేల మంది, టెక్ మహీంద్రా 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. ఏఐ సాంకేతికత కారణంగా అవసరం మేర మాత్రమే ఉద్యోగులను నియమించుకునే అవకాశమూ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి