Tuesday, October 8, 2024
HomeUncategorizedఏపీ, బిహార్‌లకు బడ్జెట్‌లో పెద్దపీట

ఏపీ, బిహార్‌లకు బడ్జెట్‌లో పెద్దపీట

Date:

ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. బడ్జెట్‌లో మాత్రం అధిక కేటాయింపులతో శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపులను పరిశీలిస్తే..

అమరావతికి రూ.15వేల కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖావృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్రం ఆ దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి.. అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది.

బిహార్‌ రోడ్లకు రూ.26వేల కోట్లు

బిహార్‌లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా రూ.26వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పట్నా-పుర్నియాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్‌-భాగల్‌పుర్‌, బోధ్‌గయా-రాజ్‌గిర్‌-వైశాలీ-దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది.