మోడీ నాయకత్వంలో ఏపీలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని, ఎన్డీఏలో చేరాలన్న టిడిపి, జనసేన పార్టీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్'(ట్విటర్) వేదికగా వెల్లడించారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ”దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం” అని తెలిపారు.
పొత్తులపై తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి. దేశాభివృద్ధికి మోదీ పదేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మా పొత్తు.. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దోహదపడుతుంది. భాజపా, తెదేపా మధ్య స్నేహం ఈనాటిది కాదు. 1996లోనే తెదేపా ఎన్డీఏలో చేరింది. వాజ్పేయి, మోదీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేసింది. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన తనవంతు మద్దతు ఇచ్చింది” అని ప్రకటనలో పేర్కొన్నారు.