ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవి మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తాము గుర్తించామని వెల్లడించింది. ఈమేరకు 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
”కొన్ని యాప్ ఆధారిత ప్రైవేటు సంస్థలు మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రయాణాలకు అనువుగాని ఈ ద్విచక్ర వాహనాలను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇక, ఈ స్కీమ్ వల్ల పన్నులు వసూలుచేయడం కూడా కష్టంగా మారింది. ప్రయాణికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈ బైక్ రైడర్లు ఘర్షణ పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అందువల్ల శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ స్కీమ్ను రద్దు చేస్తున్నాం” అని ప్రభుత్వం తమ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. 2021లో అప్పటి భాజపా ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సేవలను అమల్లోకి తెచ్చింది. దీన్ని ఆటో, క్యాబ్ యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయాలని ఆందోళనలకు దిగారు. మరోవైపు, ఈ బైక్ ట్యాక్సీల్లో వెళ్లే మహిళలపై రైడర్లు అసభ్య చేష్టలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.