తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇటీవల భారాస నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని భారాస కోరింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ వాయిదా పడింది.