Friday, September 20, 2024
HomeUncategorizedఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్ష‌న్ క‌ట్‌

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్ష‌న్ క‌ట్‌

Date:

ఎవ‌రైనా ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్ష‌న్ స‌దుపాయం నిలిపివేస్తామ‌ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిను సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు – 2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్ సుఖు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బుధవారం ఓటింగ్ నిర్వహించి ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ”ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసనసభ్యులు ఇకపై పింఛను పొందే వెసులుబాటు ఉండదు” అని ఈ బిల్లులో పేర్కొన్నారు.

హిమాచల్‌ప్రదేశ్ చట్టాల ప్రకారం.. ఐదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకు నెలకు రూ.36వేల పింఛను ఇస్తున్నారు. ఐదేళ్లకు మించి పదవీకాలం ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అదనంగా పెన్షన్‌ అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపా అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. ఆ తర్వాత బడ్జెట్‌ సమావేశాల సమయంలోనూ పార్టీ విప్‌ను కాదని వీరు సభలకు హాజరుకాలేదు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు పడింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వీరిలో ఇద్దరు మళ్లీ విజయం సాధించి సభలో అడుగుపెట్టారు. మిగతా నలుగురు ఓటమిపాలయ్యారు.