పోటీలో ఉన్న అభ్యర్థులకంటే ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. శివ్ ఖేరా అనే రచయిత పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది.
నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో (ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో) పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్లో పోలింగ్ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులు పంపించింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా ఆప్షన్ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ‘నోటా’ మీట నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.