ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోడిని ఏకగ్రీవం చేస్తూ భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, తెదేపా అధినేత చంద్రబాబు, నీతీశ్ కుమార్ (జేడీయూ), ఏక్నాథ్ శిందే (శివసేన), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్), చిరాగ్ పాసవాన్ (ఎల్జేపీ-ఆర్వీ), జితన్రామ్ మాంఝీ (హెచ్ఏఎం), పవన్ కల్యాణ్ (జనసేన), సునీల్ తట్కరె (ఎన్సీపీ), అనుప్రియ పటేల్ – ఏడీ(ఎస్), జయంత్ చౌదురి (ఆర్ఎల్డీ), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ప్రమోద్ బోరో (యూపీపీఎల్), అతుల్ బోరా (ఏజీపీ), ఇంద్ర హంగ్ సుబ్బ (ఎస్కేఎం), సుదేష్ మహతో ( ఏజేఎస్యూ) తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
మోడీ సారథ్యంలో పదేళ్లుగా ప్రజాసంక్షేమ విధానాల కారణంగా 140 కోట్ల మంది దేశ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. చాలా సుదీర్ఘ విరామం.. దాదాపు 6 దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నాము. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా.. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది” అని తీర్మానంలో నేతలు పేర్కొన్నారు.