Wednesday, October 2, 2024
HomeUncategorizedఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం..?

ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం..?

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో వరుసగా మూడో సారి అధికారం చేపడతామని, ఈ సారి తమకు 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా.. మరోవైపు ఇండి కూటమి కూడా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు ముందు వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ప్రతిబింబిస్తాయనే అని కూడా చెప్పలేం. ఎగ్జిట్ పోల్స్ వెలువరించే సంస్థలు.. ఒక్కో తీరుగా అంచనాలను జనం ముందు ఉంచే అవకాశం ఉంటుంది. 
ఎగ్జిట్ పోల్ అంటే..


ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ ముగిసిన తర్వాత జరిపే సర్వే.. ఇది ఎన్నికలకు ముందు జరిపే సర్వే అయిన ఒపీనియన్ పోల్‌ను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ సేకరించినవారు.. ఓటు వేసిన తర్వాత ఓటర్ల నుంచి వారు ఎవరికి ఓటు వేశారనే వివరాలను సేకరించే ప్రక్రియ. ఇలా కొన్ని శాంపిల్స్‌ను సేకరించి.. దానిని ఇతర అంశాలతో కూడా క్రోడికరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు డేటాను సిద్దం చేస్తాయి.

ఎగ్జిట్ పోల్‌ల వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే.. ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయలుదేరిన వెంటనే వారు ఎవరికి ఓటు వేశారనే వివరాలను తెలుసుకోవడం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించవు. భారతదేశంలో వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు, టీవీ చానల్స్, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి.

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు..?


ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేందుకు ఒక ప్రత్యేక వ్యూహం అంటూ ఏమి ఉండదు. వివిధ సంస్థలు వాటి సొంత పద్దతి, నమునా పరిమాణాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరిస్తాయి. కొన్ని సంస్థలు వ్యక్తిగతంగా ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ.. ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు ఆన్‌లైన్ వేదికగా పోల్స్ కండెక్ట్ చేస్తున్నాయి.

భారత్‌లో ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు..


దేశంలో ఎదైనా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ డేటాను వెలువరించేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఉండదు. వాటిని నిర్వహించడానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను విధించింది. ఎగ్జిట్ పోల్‌ల వినియోగంపై నియంత్రణ ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం.. ఎగ్జిట్ పోల్స్ నిర్ణీత వ్యవధిలో మాత్రమే అనుమతించబడతాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువరించేందుకు మాత్రమే ఈసీ అనుమతిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది.

ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎలా ఉంది..


ఇటీవలి దశాబ్దాల్లో ఎగ్జిట్ పోల్స్ భారతదేశంలో మరింత ప్రాచుర్యం పొందాయి. 1957లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ రెండవ లోక్‌సభ ఎన్నికల సమయంలో పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. ఇది భారతదేశంలో నిర్వహించబడిన మొట్టమొదటి ఎగ్జిట్ పోల్ అని చెబుతారు. ప్రస్తుతం ఎగ్జిట్ ఫలితాలు అనేవి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి విలువైన సాధనంగా పరిగణించబడుతున్నాయి. అయితే వివిధ సంస్థలు.. వివిధ పద్దతుల ద్వారా డేటా సేకరించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరిస్తాయి.

అయితే పలు సందర్బాల్లో కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా దగ్గరగా ఉండటం జరుగుతుంది. మరికొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవ సంఖ్యలకు చాలా దూరంగా ఉంటున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎగ్జిట్ పోల్‌లు ఏమి సూచించినా.. ఎన్నికల సంఘం అధికారికంగా ఫలితాలను ప్రకటించేదే తుది ఫలితం.