Sunday, October 6, 2024
HomeUncategorizedఉప ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే హావా

ఉప ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే హావా

Date:

దేశంలో 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బిజెపి రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. శనివారం కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించారు.

విజయం సాధించిన సీఎం సతీమణి..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ నేత హర్‌దీప్‌ సింగ్‌ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్‌పుర్‌ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్‌ శర్మ గెలుపొందారు.

బెంగాల్‌లో మ‌మ‌తా పార్టీదే విజ‌యం..

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌, బాగ్దా, మాణిక్‌తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్‌, బద్రీనాథ్‌ స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది.

పంజాబ్‌ బైపోల్‌ ఆప్‌దే..

పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడాలో భాజపా నేత కమలేశ్‌ షా గెలుపొందారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు.