Friday, October 4, 2024
HomeUncategorizedఉత్తరాఖండ్‌లో అదుపుతప్పి లోయలో పడ్డ టెంపో

ఉత్తరాఖండ్‌లో అదుపుతప్పి లోయలో పడ్డ టెంపో

Date:

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ప్రయాణికులతో వెళుతున్న టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్‌ వైపుగా బయలుదేరింది. ఈ క్రమంలోనే వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ లోయ దాదాపు 150-200 మీటర్ల లోతు ఉంటుంది. రైటోలి సమీపంలో రిషికేశ్‌- బద్రీనాథ్‌ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తంచేశారు. ”ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు.