తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలి. మన కండ్ల ముందే మనల్ని మోసం చేస్తుంటే.. మళ్లా వారికే సద్ది కడితే, ఓట్లు వేస్తే ఆగమవుతాం. సంగమేశ్వర, బసవేశ్వర పూర్తి కావాలన్నా, కరెంట్ మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. కాంగ్రెస్ గెలిచిందని మాకు ఓర్వలేని తనం ఏం లేదు. వారు కూడా ఐదేండ్లు ఉండాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తది. కానీ ఈ సీఎం మాటలు చూస్తుంటే, సభల్లో ఆయన వణుకుడు చూస్తుంటే తెలంగాణ జనం తిరగబడ్డదని అర్థమవుతోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయి. అంతటా అన్ని జిల్లాల్లో కూడా రైతాంగా తిరగబడుతుంది. అందుకే నారాయణపేట సభలో సీఎం భయం చూస్తుంటే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండేటట్టు లేదని మనవి చేస్తున్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో.. ముఖ్యమంత్రే జంప్ కొడుతడో.. ఏమైతదో తెలియని పరిస్థితి. సీఎం ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు. అక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటు వేయమని చెబుతుండు. ఏం జరుగుతంది. ఎవరు ఎవరికి బీ టీమ్. ఎవరెవరూ కలిసిపోయారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమరుసాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతంది. ఇంకా మోసపోతే డెబ్బతింటం అని కేసీఆర్ పేర్కొన్నారు.