శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. అయోధ్యలో జరిగే వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్రత్యప్రసారం ద్వారా వేడులకను వీక్షించాలని కోరింది. ఈ మేరకు రామ నవమి నాడు అయోధ్యలో జరిగే పూజ-హారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లోనే బాల రాముడిని దర్శించుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల తర్వాత రద్దీ తగ్గుతుందని.. ఆ తర్వాత బాల రామచంద్రస్వామిని దర్శించుకోవాలని తెలిపింది. రామ జన్మభూమిలోని ఆలయం నిర్మించగా.. తొలిసారిగా కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగనున్నాయి. ఈ క్రమంలో లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అంచనా. ఈ క్రమంలో రద్దీని నియంత్రించేందుకు ట్రస్ట్ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ సారి రామనవమి రోజు దాదాపు 5లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.