Wednesday, September 25, 2024
HomeUncategorizedఈడీపై మండిపడ్డ కేటీఆర్

ఈడీపై మండిపడ్డ కేటీఆర్

Date:

సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దంటూ ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. కవిత అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్‌ ప్రశ్నించారు. ”అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చి ఇప్పుడు ఎలా అరెస్టు చేశారు? కావాలనే శుక్రవారం వచ్చారని అయన ఆరోపించారు. కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్‌ కోరారు. ఈడీకి సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు, భారాస నేతలు తెలిపారు.

చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోంది. రాజకీయంగా కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీని బలి చేయడానికి నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో మా పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదో విఫలప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ నేతలు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటాం. చట్ట పరంగా న్యాయస్థానాల్లో పోరాడుతాం. ఎమ్మెల్సీ కవితకు భారాస పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది” అని మాజీ మంత్రి, భారాస నేత ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.